ఆంధ్రుల కథ - 36

ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..

పుట్టుదోషాలు పోతాయా?...... (December 27th, 2010)

‘‘అదొక విచిత్ర ఘటన. గత రెండు మహాసభలలో రాజ్యాంగ సంస్కరణలను బహిష్కరిస్తు వచ్చిన తీర్మానం ఈ ధర్మవరం సభలో మార్పు పొందింది. రాత్రి జరిగిన విషయ నిర్ణయసభలో అధిక సంఖ్యాకులు, కమ్యూనిస్టులు సహా, రాజ్యాంగ సంస్కరణలను బహిష్కరించవలెనని తీర్మానించారు. సంస్కరణలను ఖండిస్తూ నిప్పులు చెరిగారు.
‘‘సంస్కరణలను ఆమోదించాలనే వర్గనాయకులైన శ్రీ మందుముల నరసింగరావుగారు సమావేశానంతరం కమ్యూనిస్టు నాయకుల చేర పిలిచి వారికి ప్రజాయుద్ధపు పాలసీని వివరించి చెప్పి ప్రభుత్వంతో సహకరించడం ఆ పాలసీ రీత్యా వారి విధి అవుతుందని నచ్చచెప్పారు. దాంతో వారు రంగుమార్చారు... ఆ రాత్రి అంగీకరించిన కమ్యూనిస్టులు తెల్లవారేవరకే రాజ్యాంగ సంస్కరణలను కొన్ని మార్పులతో అంగీకరిస్తామన్నారు. ఆనాటి నుండి నరసింగరావుగారు కమ్యూనిస్టుపార్టీకి సలహాదారైనారు. రాజ్యాంగ సంస్కరణలను బహిష్కరించవలెననే వర్గం మైనార్టీగా ఉండిపోయింది.
‘తెలంగాణం’ వ్యాస సంకలనంలో కోదాటి నారాయణరావు, పే.290, 291
వట్టికోట ఆళ్వారుస్వామి సంకలించిన ‘తెలంగాణం’లో ‘‘తెలంగాణలో రాజకీయోథ్యమాలు: సింహావలోకనం’’ పేర కోదాటి నారాయణరావు రాసిన వ్యాసంలోని భాగమిది. ధర్మవరంలో జరిగిన తొమ్మిదవ ఆంధ్ర మహాసభలో కమ్యూనిస్టుల పిల్లిమొగ్గ గురించి ఆయన అవగాహనను చూస్తే కోదాటి కల్లకపటం ఎరుగని అమాయకుడనుకోవాలి. ఒకవేళ ఇదే అవగాహన కమ్యూనిస్టులతో కబుర్లాడిన మందుముల వారికీ ఉండి ఉంటే ఆయన కోదాటిని మించిన అమాయక చక్రవర్తి అయి ఉండాలి!
కమ్యూనిస్టులు వీరికి చదువు చెప్పగలిగిన గండరగండలు. మంచిచెడ్డల సంగతి పక్కనపెడితే- తమ విధానాలు ఏమిటి, ఏ సమయంలో ఏ ఎత్తుగడ పన్నాలి, ఎప్పుడు ఏ వైఖరి అనుసరించాలి అన్న విషయంలో కమ్యూనిస్టులకు అవసరానికి మించిన బోధలను వారి పార్టీ నాయకులే రాజకీయ తరగతులుపెట్టిమరీ నూరిపోస్తుంటారు. మనం చెప్పుకుంటున్న కాలంలో కూడా చండ్ర రాజేశ్వరరావు వంటి కామ్రేడ్లు ఆంధ్ర ప్రాంతంనుంచి వచ్చి తెలంగాణలో పార్టీని రహస్యంగా ఆర్గనైజు చేసేవారు. రష్యాయుద్ధంలోకి దిగాక మారిన పరిస్థితిలో సామ్రాజ్యవాదులతో ఎలా వ్యవహరించాలన్న విషయంలో అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ఎన్నో మల్లగుల్లాలుపడి భారత కమ్యూనిస్టులు తమకంటూ (అది ఎంత వంకరదైనా) ఒక విధానమంటూ అప్పటికే ఏర్పరచుకున్నారు. దాని ప్రకారం నిజాం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకుండా ఒదిగి ఉండాలని అంతకుముందే నిర్ణయించుకున్నారు. నిజాం సర్కారుతో ఘర్షణపడే ఉద్దేశాన్ని మానుకున్నందువల్లే ధర్మవరం తొమ్మిదో ఆంధ్రమహాసభ అధ్యక్షత్వం అందివచ్చినా తమకు వద్దని వదిలేసుకున్నారు. తమ చేతికి మట్టి అంటకుండా మితవాది మాదిరాజుకు ఆ ముళ్ల కిరీటాన్ని ఏరికోరి కట్టబెట్టారు. ఆ సంగతి అప్పటి ఓ కమ్యూనిస్టు సీనియర్ నాయకుడైన దేవులపల్లి వెంకటేశ్వరరావే కుండబద్దలుకొట్టిన సంగతి ఇంతకుముందు చూశాం. ఈ నేపథ్యాన్ని గుర్తుపెట్టుకుంటే- ప్రజాయుద్ధపు పాలసీని నైజాంకు ఎలా అన్వయించాలో, మితవాది మందుముల నరసింగరావు చేత చెప్పించుకోవలసిన అయోమయ స్థితిలో నాటి కమ్యూనిస్టులు లేరన్నది స్పష్టం.
నిజాం ప్రకటించిన రాజ్యాంగ సంస్కరణలని బహిష్కరించటం మితవాదులకు మొదటినుంచీ ఇష్టంలేదు. పట్టుబట్టి లోగడ తామే తెచ్చిపెట్టిన బహిష్కరణను మారిన పరిస్థితుల్లో కొనసాగించటం కమ్యూనిస్టులకూ ఇష్టంలేదు. పాత తీర్మానాన్ని తామే తుంగలోతొక్కితే జనంలో నగుబాటు. కాబట్టి ఆ పనేదో మితవాదుల చేతితోనే చేయించాలని కమ్యూనిస్టులు అనుకున్నారు. ఆ ఉద్దేశంతోటే మితవాది మాదిరాజును పీటల మీద కూచోబెట్టారు. రోగి కోరిందే వైద్యుడూ ఇచ్చినట్టు... తాము కోరుకున్నదే మందుములా చెప్పాడు కనుక ఆయన చేత నచ్చచెప్పించుకున్నట్టు కనిపించి కమ్యూనిస్టు కిలాడీలు కాగలకార్యం తెలివిగా సాధించారు. ఈ ప్రచ్ఛన్న కమ్యూనిస్టుల మతలబును పసికట్టలేక... వారు కూడా తమలాంటి అతివాదులేనని భ్రమసి అప్పటిదాకా వారితో గళం, భుజం కలిపిన జాతీయవాద యువకులు జరిగిందేమిటో అర్థంకాక తెల్లబోయారు.
‘‘రాజ్యాంగ సంస్కరణలను తిరస్కరించాలని ఏడవ (మల్కాపురం) మహాసభలో ఆమోదించిన తీర్మానాన్ని మార్చివేసి, సంస్కరణలను కొన్ని షరతులతో అంగీకరించాలనే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాజ్యాంగ సంస్కరణల్లో ‘‘పుట్టుదోషాలున్నాయని ఏడవ మహాసభ తీర్మానంలో సరిగా నిర్ధారణ చేశారు. పరిస్థితులు మారినంతమాత్రాన కొన్ని మార్పులు చేర్పులవలన పుట్టుదోషాలు తొలగిపోవు. పరిస్థితులు మారినవనే పేరుతో ప్రభుత్వంతో రాజీపడే విధానాన్ని అనుసరించారు. ఇది మితవాదుల విధానానికి అనుగుణ్యంగా ఉన్నవే కాని నిజమైన ప్రజాతంత్ర విధానం కాదు. విప్లవ విధానం అసలే కాదు.’’- అని ఆక్షేపిస్తారు. అప్పటి తమ పార్టీ వైఖరిని అనంతర కాలంలో దుయ్యబట్టిన గ్రంథంలో సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు దేవులపల్లి. (తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర పే.225, 226)
నిజాం ఛత్రచ్ఛాయల కింద బాధ్యతాయుత ప్రభుత్వం కావాలని ఎనిమిదో (చిలుకూరు) ఆంధ్ర మహాసభ అధ్యక్షోపన్యసంలో కామ్రేడ్ రావి నారాయణరెడ్డి, ప్రశస్తమైన ప్రతిపాదన చేశాడు. మరుసటి సంవత్సరం తొమ్మిదో (్ధర్మవరం) మహాసభలో నిజాం సర్కారు సంస్కరణలను బహిష్కరించే వెనకటి తీర్మానానికి మితవాదుల మద్దతుతో మంగళం పాడించారు. అటు తర్వాత పిచ్చి కుదిరింది తలకు రోకలి చుట్టమన్నట్టు తమ మార్క్సిస్టు లెనినిస్టు నిష్ఠాగరిష్ఠ విప్లవ ప్రస్థానంలో ఇంకో అడుగు ముందుకువేసి ముస్లిం మతోన్మాద శక్తులకు అధికారంలో సగం వాటా ఇప్పించాలని ఉబలాటపడ్డారు!
ఈ సరికొత్త వింత పాలసీని వివరిస్తూ ‘‘నేటి హైదరాబాదు- మన కర్తవ్యం’’ అనే ఒక పుస్తకాన్ని దేవులపల్లి వెంకటేశ్వరరావు, బద్దం ఎల్లారెడ్డిల పేర్లతో కమ్యూనిస్టు రాష్ట్ర కమిటీ ప్రచురించింది. ఆంధ్ర మహాసభపై నిప్పులుకక్కే ఇత్తెహాదుల్ ముసల్మీన్‌పై విమర్శలను ఒగ్గేసి, ఆ పక్కా మత సంస్థలో ప్రజాతంత్ర లక్షణాలను ఆ పుస్తకంలో దర్శించారు. యుద్ధంలో ఫాసిజాన్ని ఓడించే పనిలో భాగంగా హైదరాబాద్ సంస్థానంలో అప్పుడున్న ప్రభుత్వంస్థానే ఇత్తెహాదుల్ ముసల్మీన్ ప్రతినిధులు, ఆంధ్ర మహాసభ, మహారాష్ట్ర, కర్ణాటక పరిషత్తు ప్రతినిధులతో ప్రభుత్వం ఏర్పడాలని అందులో లోకోత్తర ప్రతిపాదన చేశారు. ఆలోచన అద్భుతం. మరి వాటాలు ఎలా? నాలుగు వర్గాలకు చోటు పెట్టాలి కాబట్టి తలా నాలుగోవంతా? కాదు. నూటికి నిండా 20 శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహించని ఇత్తెహాదుల్ ముసల్మీన్‌కేమో భీమునిపాలు (50 శాతం)! మిగతా 80 శాతం పైచిలుకు జనానికి ప్రాతినిధ్యం వహించే ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర సంస్థలకేమో మిగతా సగంలో తలా మూడోవంతు- అని కమ్యూనిస్టుల ధర్మ నిర్ణయం!
పేరు తెలంగాణ రచయితలవైనా ఆ పుస్తకం వాళ్లు రాసిన పుస్తకం కాదనీ, సర్కారు జిల్లాలవారు రాసిందనీ సురవరం ప్రతాపరెడ్డి ‘గోలకొండ పత్రిక’లో సహేతుకంగా నిరూపించాడు. ఆ విమర్శ నిజమే, ఆ పుస్తకం మేము రాసింది కాదని స్వయంగా దేవులపల్లే గుట్టు రట్టు చేశాడు.
కమ్యూనిస్టులు కేవలం పుస్తకాన్ని జనంలోకి వదిలి ఊరుకోలేదు. 1943లో హైదరాబాదులో జరిగిన పదో ఆంధ్ర మహాసభలో ఇత్తెహాదుల్ ముసల్మీన్‌కు ఏర్పడవలసిన ప్రజాప్రభుత్వంలో సగం స్థానాలు ఇవ్వాలంటూ కమ్యూనిస్టుపార్టీ తరఫున ఏకంగా సవరణ తీర్మానమే తెచ్చారు. సుదీర్ఘ చర్చల తరవాత, అదృష్టవశాత్తూ ఆ అప్రజాస్వామిక, అసంబద్ధ ప్రతిపాదన వీగిపోయింది. ‘ఆనాడు మేముచేసిన ఈ ప్రతిపాదన పొరపాటు అని ఇత్తెహాదుల్ముసల్మీన్ వారి చరిత్ర వేనోళ్ల చాటింది’ అని రావి నారాయణరెడ్డిగారు అనంతర కాలంలో సదరు చారిత్రక తప్పిదాన్ని యథావిధిగా ఒప్పుకోక పోలేదు. కాని జరగాల్సిన డామేజి జరిగేపోయింది.
పదో ఆంధ్ర మహాసభలో కమ్యూనిస్టుల ప్రతిపాదన ఎందుకు నెగ్గలేదు? ఆంధ్ర మహాసభలో చాపకింద నీరులా కమ్యూనిస్టులు వ్యాపించే పని అప్పటికీ పూర్తికాలేదు. మితవాదులనీ, వారి మెతకతనాన్నీ వ్యతిరేకించే అతివాద కాంగ్రెసు యువకులదే అప్పట్లో బలాధిక్యం. అందుకే మొట్టమొదటిసారిగా అధ్యక్ష పదవికి పదో ఆంధ్ర మహాసభలో జరిగిన ఎన్నికలో కమ్యూనిస్టుల అభ్యర్థి బద్దం ఎల్లారెడ్డి విశ్వప్రయత్నం చేసినా ఓడిపోయాడు. అసలు ప్రచారమే చేయక ఇంటి పట్టున కూచున్న కె.వి.రంగారెడ్డి అవలీలగా గెలిచాడు.
సంవత్సరం తిరిగి భువనగిరిలో పదకొండో మహాసభ వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అప్పటికి కమ్యూనిస్టుల ముసుగు తొలగింది. నిషేధం ఎత్తివేయడంతో కమ్యూనిస్టుపార్టీ బాహాటంగా పనిచేయసాగింది. అప్పటిదాకా రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి అతివాద, జాతీయవాద యువకులు... అంతే- అనుకున్న అమాయకులకి కూడా ఎవరు ఏమిటో అర్థమైంది. ఆంధ్ర మహాసభను మళ్లీ కమ్యూనిస్టుల చేతిలో పెట్టటం ఆంధ్ర ప్రముఖులకు ససేమిరా ఇష్టంలేకపోయింది.
అయినా- ఆశ్చర్యం! అధ్యక్ష పదవి కామ్రేడ్ రావి నారాయణరెడ్డినే రెండోసారి వరించింది.
ఇదెలా జరిగింది? గడచిన సంవత్సర కాలంలో కమ్యూనిస్టులు విపరీతంగా పుంజుకున్నారా? మిగతా అన్ని వర్గాలనూ ఒంటిచేత్తో చిత్తు చేయగలిగిన అద్భుత బలాధిక్యం సంపాదించారా? లేదు. మిగతా వర్గాలే అతి తెలివికిపోయి, మూర్ఖపు అంచనాలు వేసుకుని అధ్యక్షత్వాన్ని పళ్లెంలోపెట్టి కమ్యూనిస్టులకు సమర్పించుకున్నాయి.
తరవాత తీరుబడిగా విచారించాయి!
ఈ విచిత్ర దృశ్యం అర్థంకావాలంటే ఆంధ్ర మహాసభ పరిణామక్రమాన్ని గమనించాలి.
తెలంగాణలో ఆంధ్రోద్యమాన్ని, ఆంధ్ర మహాసభను ప్రారంభించింది మాడపాటి, మందుముల, కె.వి.రంగారెడ్డి వంటి మితవాదులు. వారు కాంగ్రెసువాదులని చాలామంది పొరపడతారు. కాని కాదు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, సుప్రసిద్ధ గాంధీయవాది ఎం.ఎస్.రాజలింగంగారు విప్పి చెప్పినట్టు-
మితవాదులు కాంగ్రెసు అభిమానులని ప్రజలు భావించినా వారు మాత్రం కాంగ్రెసు వారమని చెప్పుకునేవారు కాదు... ఆంధ్ర మహాసభలో కాని, మరే సభలోనైనా కాంగ్రెసు పతాకాన్ని ఆవిష్కరించాలనే ఉద్దేశం వారికి ఉండేది కాదు. ప్రభుత్వ యంత్రాంగంలో సంబంధం పెట్టుకుని రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలనే కాంక్ష అధికంగా ఉండేది. వీరిలో ఆజాద్ హైదరాబాద్ వీలుంటే కోరుకునే వారున్నారు. సంస్కరణలతో, చట్టబద్ధమైన విన్నపాలతో ఈజీ ఛైర్ పొలిటీషియన్స్‌గా వ్యవహరించే మనస్తత్వం వీరి ప్రత్యేకత... 1946లో రాజద్రోహ నేరం కింద మమ్మల్ని అరెస్టుచేసే నాటికి కూడా ఆంధ్రమహాసభ మితవాద నాయకులు తాము కాంగ్రెసువాదులమని చెప్పుకోవడం లేదు.
స్వీయచరిత్ర, ఎం.ఎస్.రాజలింగం, పే.187, 168
మితవాథ నాయకులకు ఇష్టంలేకపోయినా హైదరాబాదు సంస్థానంలో జాతీయోద్యమ ప్రభావం క్రమేణా హెచ్చింది. మిగతా దేశంలో సాగుతున్న స్వాతంత్య్ర పోరాటం నైజాం యువతరానికి స్ఫూర్తినిచ్చింది. 1938లో స్టేట్ కాంగ్రెసును స్థాపించి, దానిపై నిషేధానికి వ్యతిరేకంగా సత్యాగ్రహాలు ముమ్మరమై, వందలాది కార్యకర్తలు జైళ్లకు వెళ్లాక యువతపై జాతీయవాదం తీవ్ర ప్రభావం చూపింది. కాంగ్రెసు పట్ల, అతివాద కాంగ్రెసు నాయకుల పట్ల, వారి సోషలిస్టు సిద్ధాంతాల పట్ల అభిమానం పెరిగింది. మొదట్లో రావి నారాయణరెడ్డి లాంటివారూ ఈ బాపతే. కాబట్టి వారూ తమ కోవలోని అతివాద, జాతీయవాదులేనని కాంగ్రెసు అభిమానులు తలిచారు. పాతకాలపు మితవాదులు, నవతరం అతివాదులు అని ఆంధ్ర మహాసభలో రెండే తరగతులున్నాయని అందరూ భావించారు.
చిలుకూరు సభలో రావి వారి అధ్యక్ష ప్రసంగాన్ని అక్కడ కమ్యూనిస్టు పాటల, నినాదాల హడావుడిని చూశాక పరిస్థితిలో తేడా వచ్చిందని జాతీయవాదులకి అనుమానం వచ్చింది. పార్టీపై నిషేధం తొలిగి, కమ్యూనిస్టులు బాహాటంగా బయటపడ్డాక, అది రూఢి అయింది. ఒక పక్క కాంగ్రెసు పార్టీ బ్రిటిషు సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ ‘క్విట్టిండియా’ పోరాటం సాగిస్తూంటే... ఇంకోవంక కమ్యూనిస్టులు ‘ప్రజాయుద్ధం’ పాలసీతో, విదేశీ విధేయతతో, బ్రిటిషు సామ్రాజ్యవాదానికి కొమ్ముగాయటం జాతీయ పక్షం వారికి ఒళ్లు మండించింది. జాతి వ్యతిరేకులని తాము తలచే కమ్యూనిస్టులకు ఆంధ్ర మహాసభను మళ్లీ ఒప్పగించడం వారికి ఎంతమాత్రం ఇష్టంలేదు.
అలాగని- ఆంధ్ర మహాసభలోని మితవాదులంటేనూ వారికి ప్రేమ లేదు. నిరంకుశ నిజాం దొరతనాన్ని తమవలె ఎదిరించి, ఎంతటి పర్యవసానానికైనా సిద్ధపడటానికి దమ్ముల్లేని మితవాదుల మెతకతనమంటే వారికి ఆదినుంచీ చిన్నచూపే. అయినా తొందరపడలేదు.
దశమాంధ్ర మహాసభ అధ్యక్ష స్థానానికి పోటీచేసిన బద్దం ఎల్లారెడ్డి అభ్యుదయవాది! మామూలుగా అయితే ఆయననే జాతీయవాదులు బలపరచవలసి ఉండింది... అయినా కోదాటి, కాళోజీ, జమలాపురం, రాజలింగం వంటి జాతీయ పక్షపు అతివాదులు కమ్యూనిస్టు ‘ప్రజాయుద్ధం’ పాలిసీమీది వ్యతిరేకతతో తమ తోటివాడిని ఓడించారు. కె.వి.రంగారెడ్డి అంతటి కరకు మితవాదిని గెలిపించారు. సిపాయిల్లేని సేనానులైన మితవాదులను తమవంటి సిపాయిలు ఏనాటికైనా దారికి తెచ్చుకోగలమని వారు తలచారు.
కాని వారి లెక్క తప్పింది. ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టుల పరం కానీయకుండా తమకు సహాయపడ్డారన్న కృతజ్ఞత లేకుండా మితవాద నాయకులు తల ఎగరేశారు. హైదరాబాదులో పదో మహాసభకు అధ్యక్షుడైన కె.వి.రంగారెడ్డి తన అధ్యక్షోపన్యాసంలోనే ‘‘జాతీయవాదులు కాంగ్రెసులోకి పొండి. కమ్యూనిస్టులు కమ్యూనిస్టుపార్టీకి పొండి. ఆంధ్ర మహాసభ మాది- అన్నాడు. ఆయన అధ్యక్షుడు కావడానికి కారకులైన తమమీదే అలా ధ్వజమెత్తడం జాతీయ పక్షంవారికి సహజంగానే కోపం తెప్పించింది. (అప్పటికే మందుముల రామచంద్రరావు, కాళోజీ, కోదాటి, రాజలింగం, హయగ్రీవాచారి వంటి జాతీయవాదులు కలిసి ఆంధ్ర మహాసభలో అంతర్భాగంగా ఆంధ్ర జాతీయపక్షాన్ని ఏర్పాటుచేసుకున్నారు. కమ్యూనిస్టుపార్టీ తరహాలో కాడర్ ప్రాతిపదికన దాన్ని నడపాలని గట్టిగానే తంటాలుపడ్డారు.)
తదుపరి 1944 మేలో భువనగిరి 11వ మహాసభ అధ్యక్ష ఎన్నిక సమయం వచ్చేసరికి మితవాదులకు బుద్ధిగరపడంకోసం ఆంధ్ర మహాసభలో గణనీయ బలంగల జాతీయవాదులు తటస్థంగా ఉండిపోయారు. ఎలాగూ మితవాదులది మునిగే పడవే కాబట్టి... వారు గెలవలేరు; తమని గెలవనివ్వరు కాబట్టి మేలు మరచిన వారితో తమకేమి పని అని అనుకున్నారు. కమ్యూనిస్టుల చేతిలో ఒకసారి మాడుపగిలితే మితవాదులే తమ దారికి వస్తారు లెమ్మని జాతీయ పక్షీయులు వెర్రి ఊహచేశారు.
ఇక మితవాదులేమో తమ కోడి, కుంపటి లేకుంటే తెల్లవారదనుకున్న ముసలమ్మలాగే తమ తాహతును అతిగా ఊహించుకున్నారు. తాము లేకుంటే భూస్వాములు, సంపన్నులు ఎవరూ ఆంధ్ర మహాసభకు దమ్మిడీ విరాళం ఇవ్వరనీ, వారి విరాళాలు తమ తోడ్పాటు లేకపోతే ఆంధ్ర మహాసభను ఎవరూ నడపలేరనీ మితవాదులు అపోహపడ్డారు. తాము బిర్రబిగిస్తే కమ్యూనిస్టులు కాళ్లబేరానికి వస్తారు; మావల్లకాదు మహాప్రభో ఈ మహాసభను మీరే ఏలండి అంటూ ప్రాధేయపడతారు అని పథకంవేసి స్థారుూ సంఘం నుంచి తప్పుకున్నారు.
ఇంకేం? మితవాదుల అస్తస్రన్యాసంతో, జాతీయవాదుల తటస్థ వైఖరితో కమ్యూనిస్టుల రొట్టె విరిగి నేతిలో పడి ఆంధ్ర మహాసభ అధ్యక్ష పీఠం రెండోసారి వారి కైవసమైంది. అప్పట్లో స్థారుూ సంఘంలోనూ, కార్యవర్గంలోనూ కమ్యూనిస్టులు మైనారిటీ! ‘‘ప్రజాయుద్ధం’’ తప్పుడు విధానంతో బ్రిటిషు తొత్తులుగా, నిజాం పల్లకీ బోరుూలుగా ప్రజల్లో భ్రష్టుపట్టిన స్థితిలో, సంస్థాపరంగా అప్పుడు తమకున్న బలహీనతల్లో ఆంధ్ర మహాసభను స్వాధీనం చేసుకోగలమని కమ్యూనిస్టులు భావించలేదు.
తరవాత కథ మూడుముక్కల్లో చెప్పాలంటే...
అయాచితంగా అందివచ్చిన అవకాశాన్ని కమ్యూనిస్టులు చక్కగా వినియోగించుకున్నారు. చిక్కిన పట్టును అన్నివిధాలా గట్టి చేసుకున్నారు. కథ అడ్డంతిరిగాక మితవాదులు, జాతీయవాదులు తెలివితెచ్చుకుని ఏకమయ్యారు. సభ్యత్వాన్ని విరివిగా చేర్పించి, కమిటీలను పట్టుకుని సంస్థను తిరిగి తమ చేతుల్లోకి తీసుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు. కమ్యూనిస్టులు వాటిని పడనివ్వలేదు. సభ్యత్వం ఫారాలనూ వారికి దొరకనివ్వలేదు. దాంతో అవతలి పక్షంవాళ్లు సొంతంగా ఫారాలు ముద్రించి, సభ్యత్వం చేర్పించి, పోటీ ఆంధ్ర మహాసభను పెట్టుకున్నారు. వంతు ప్రకారం 1945 మార్చిలో వరంగల్ జిల్లా మడికొండలో మితవాది మందుముల నరసింగరావు అధ్యక్షతన 12వ మహాసభను, 1946 మేలో జాతీయవాది జమలాపురం కేశవరావు అధ్యక్షతన 13వ మహాసభ మెదక్ జిల్లా కందిలోనూ కమ్యూనిస్టు సభలకు దీటుగా కాంగ్రెసు జండాలతో కోలాహలంగా జరిగాయ. స్టేట్ కాంగ్రెసుపై నిషేధం ఎత్తివేశాక జాతీయ పక్షంవారు గుడారం ఎత్తేసి అందులో చేరిపోయారు. సేనలు పోయాక మితవాద సేనానులు ఏమి చేయలేకపోయారు. అటువైపు కమ్యూనిస్టుల నేతృత్వంలోని ఆంధ్ర మహాసభ 1945 ఏప్రిల్‌లో ఖమ్మంలో మొక్కుబడిగా సభ జరిపాక ఫ్యూడల్ వ్యతిరేక గెరిల్లా సాయుధ పోరాటంలో పూర్తిగా నిమగ్నమైంది. నిజాం పోలీసులతో, రజాకార్లతో మహాయుద్ధం చేసింది. ఎన్నో విజయాలను సాధించింది. ఎన్నో తప్పులూ చేసింది. తప్పటడుగులూ వేసింది. పెడదారి పట్టి చివరికి విషాదాంతమైంది.
అది వేరే కథ. *